పదవీ విరమణ మహోత్సవసభ

అంకితభావంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలను ప్రిన్సిపాల్ డాక్టర్ బి.యల్.సుగుణ ప్రగతిపధంలో నడిపించారని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. ఆగష్టు 31 శుక్రవారం జిల్లెళ్ళమూడిలో జరిగిన డాక్టర్ బి.యల్.సుగుణగారి ఉద్యోగ విరమణ సమావేశంలో అధ్యక్షులుగా ప్రవచన సమ్రాట్ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు ముఖ్య అతిధులుగా, సంస్థ చీఫ్ ప్యాట్రన్ బ్రహ్మాండం రవీంద్రరావుగారు ఆత్మీయ అతిధిగా, కళాశాల కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు గౌరవ అతిధులు, యాక్టింగ్ ప్రెసిడెంట్ శ్రీ యన్.లక్ష్మణరావుగారు, స్థానిక కార్యదర్శి శ్రీ బి. రామచంద్ర, కళాశాల అధ్యాపకులు డాక్టర్ కె.వి.కోటయ్య తదితరులు ప్రసంగించారు. క్రమశిక్షణకు మారుపేరుగా విద్యాబోధనలో అత్యుత్తమ ప్రమాణాలను పాటించిన డాక్టర్ బి.యల్.సుగుణగారిని అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. విద్యార్థినీ విద్యార్థులు అధ్యాపకేతర సిబ్బంది పుష్పార్చనతో జేజేలు పలుకుతూ ఆమెను వేదిక వద్దకు ఆహ్వానించారు. తనకు జరిగిన సన్మానానికి డా.బి.యల్. సుగుణ ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం, వారి ఉన్నతి కోసం విద్యాబోధనతో పాటు వివిధ ఉద్యోగపోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం, వారిని సన్మార్గంలో నడిపించడం, తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. విద్యార్థులలో సేవాగుణం, పరోపకారబుద్ధి, త్యాగ భావన వర్థిల్లేలా తమ వంతు సేవలను అందించినట్లు వివరించారు. తన ఉద్యోగ విరమణ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రగతి కోసం 3,00,000ల రూపాయిలను ఆమె కళాశాలకు అందించారు.

ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 29-8-2018 న తెలుగు భాషా దినోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నంబూరు జడ్.పి.హైస్కూల్ ఉపాధ్యాయులు శేషాద్రి గారు విచ్చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. జి.యల్ సుగుణ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్ని భాషలున్నా తెలుగుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నదని తెలిపారు. ఏ భాషలోని పదాలనైనా తెలుగులో చాలా సులభంగా స్వీకరించవచ్చని ఉదాహరణ పూర్వకంగా శేషాద్రి తెలియజెప్పారు. తెలుగు భాషకే సొంతమైన అవధాన ప్రక్రియ గొప్పదనాన్ని వివరించారు. తెలుగు వ్యావహారికభాషోద్యమకారులైన గిడుగువారి కృషిని తెలుగు ఉపాధ్యాయులు డా. మధుసూదనరావు గారు కొనియాడారు. కె.వి.కోటయ్య గారు ప్రసంగిస్తూ అమ్మభాషను నేర్చుకోకుండా పరభాషను నేర్చుకోలేమని ఆంగ్లకవి అన్నవిషయాన్ని గుర్తుచేశారు. కళాశాల ప్రిన్సిపాల్ గారు భాష గొప్పదనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శోభన, అనూషలు పెద్దన్నగారు రచించిన ఉత్పలమాలను ఆశువుగా చెప్పారు. నంబూరు జెడ్.పి హైస్కూల్ విద్యార్థులైన షేక్ హసీనా, షేక్ పాపాంచ్, పోతన రచించిన గద్యమును అనర్గళంగా పఠించారు. గిడుగువారి కీర్తిని విద్యార్థులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ఆసాంతం విద్యార్థులచే నిర్వంచబడింది.

పాటల పోటీలు

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జూలై 10 నుండి 29 వరకు విద్యార్థినీ విద్యార్థులకు సంగీత శిక్షణ కార్యక్రమం జరిగింది. సంస్థపెద్దలు, అమ్మ భక్తులు అయిన శ్రీ రావూరి ప్రసాద్ రావు ఈ సంగీత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ ముగింపు సందర్భంగా జూలై 28 వ తేదీన అన్నపూర్ణాలయం సమావేశ మందిరంలో విద్యార్థినీ విద్యార్థులు సంగీత కార్యక్రమం నిర్వహించి అమ్మ భక్తి గీతాలను గానం చేశారు. సంగీతం శ్రోతలను అలరించడంతో పాటు ఆనందాన్ని, అనుభూతిని అందిస్తుందని సంగీత శిక్షకులు రావూరి ప్రసాదావు వివరించారు. కళాశాల కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు సంస్థ పెద్దలు బ్రహ్మాండం వసుంధరక్కయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డా॥ బి.యల్. సుగుణ, శ్రీ యమ్. దినకర్, శ్రీ బి. రామచంద్ర కళాశాల అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉత్తమశిక్షణ ఇచ్చిన అమ్మ ఆస్థాన గాయకులు శ్రీ రావూరి ప్రసాదును ఘనంగా సత్కరించారు. శ్రీ ప్రసాద్ ఈ సంగీత శిక్షణను ఏర్పాటు చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డా॥ బి.యల్. సుగుణ, సంస్థ స్థానిక కార్యదర్శి శ్రీ బి. రామచంద్రను అభినందించి ఘనంగా సత్కరించారు.

“అమ్మలో అమ్మ”

ఆధ్యాత్మిక ధార్మిక పారమార్థిక గ్రంథాలు ఉత్తమమైన “మానసిక స్థితికి తోడ్పడుతాయని ‘అమ్మలో అమ్మ‘ గ్రంథకర్త వేదాద్రి కేంద్రం నిర్వాహకులు, విశ్రాంతి అధ్యాపకులు అయిన స్వామి విరజా నందగిరి వివరించారు. ఈనెల 10వ గురువారం కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సభలో అమ్మ గ్రంధావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉభయ పరిషత్తుల తరపున శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు పాల్గొని ప్రసంగించారు. కరస్పాండెంట్ శ్రీ.పి.యస్. ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుదామ అమ్మ అందరికీ  మార్గదర్శకమని వివరించారు. శ్రీ బ్రహ్మాండం రవీంద్ర గారు మట్లాడుతూ అమ్మ మాటలు నిత్యసత్యాలని తెలిపారు. ప్రధాన వక్త E.C member  శ్రీ యమ్. దినకర్ మాట్లాడుతూ చైతన్యస్వరూపిణి అయిన అమ్మ తత్వాన్ని అర్థంచేసుకొని ప్రగతిపథంలో పయనించాలని హితువు పలికారు. కళాశాల విశ్రాంతి ప్రిన్సిపాల్ డా॥బి.ఎల్. సుగుణ మాట్లాడుతూ విశ్వంలోని సమస్త ప్రాణికోటీ అమ్మకు సమానమేనని సోదాహరణంగా తెలిపారు. ఈ సందర్భంగా గ్రంథకర్త తె. నందగిరి స్వామిని కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధామవంశీ  ఘనంగా సత్కరించారు