కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవం

ది 15.08.2023 న మన కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి SVJP మేనేజింగ్ ట్రస్టీ శ్రీ గిరిధర్ అన్నయ్య గారు, కరస్పాండెంట్ శ్రీ రాఘవేంద్ర అన్నయ్య గారు, డా.రామకృష్ణ ఆంజనేయులు అన్నయ్య గారు, కళాశాల పూర్వ ప్రిన్సిపల్ డా. సుధామ వంశీ అన్నయ్య గారు విచ్చేశారు. శ్రీ గిరిధర్ అన్నయ్య గారు పతాకావిష్కరణ చేశారు. అనంతరం జరిగిన సభాకార్యక్రమంలో పెద్దలు ప్రసంగించారు. ప్రతిభావంతులు మరియు పేద విధేయ విద్యార్థులకు అమ్మభక్తులు ప్రతీ ఏటా ఇచ్చే ఉపకార వేతనాలు పెద్దలచే అందజేయబడ్డాయి. విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. స్వాతంత్య్ర దినోత్సవ విశేషాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. శాంతి మంత్రంతో మిఠాయి పంపిణీతో కార్యక్రమం ముగిసింది.
ఇతర అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. సంస్కృతం లోనే సంభాషిస్తామని విద్యార్థులు పలికారు.

ఆజాదీ కా అమృత మహోత్సవం

ఈ ఉత్సవాల్లో భాగంగా జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 13, 14 తేదీల్లో పలు దేశభక్తి కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులకు 13 వ తేదీ ఉ దయం చిత్రలేఖనం మధ్యాహ్నం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కళాశాల భవనంపై మువ్వన్నెల జండా ఎగురవేశారు. అనంతరం విశ్వజననీ టెంపుల్స్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ యమ్. దినకర్ గారి చేతులమీదగా గుంటూరు జిల్లా స్వాతంత్ర్యోద్యమకారుల చరిత్ర ప్రదర్శన ప్రారంభించబడింది. అదేరోజు మధ్యాహ్నం విద్యార్థుల్లో దేశభక్తి స్ఫూర్తిని కలిగించేలా గీతాలాపన కార్యక్రమం జరిగింది. 14వ తేదీ ఉదయం అమృతోత్సవ నినాదాలతో కళాశాల నుండి ర్యాలీ ప్రారంభమై జిల్లెళ్ళమూడి గ్రామంలో కొనసాగింది. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ‘హర్ ఘర్ తిరంగా’ అని గ్రామస్థులలో స్ఫూర్తి కలిగేలా విద్యార్థులు అధ్యాపకులు ఈ ర్యాలీని నిర్వహించారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15.08.2021 మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడిలో 15.8.21 ఆదివారంనాడు 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. వైభవంగా కళాశాల మరియు పాఠశాలల కరస్పాండెంట్ శ్రీమతి బి.యల్.సుగుణ గారు పతాకావిష్కరణ చేశారు. ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ ప్రెసిడెంట్ గారు శ్రీ యమ్. దినకర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు, శ్రీ. పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు, శ్రీ పి. గిరిధర్ కుమార్ గారు, శ్రీ రావూరి ప్రసాద్ గారు, శ్రీ బూదరాజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పాల్గొన్నారు. పలువురు దాతలు విద్యార్థులను ప్రోత్సహిస్తూ అందించిన బహుమతులను సంస్థ పెద్దలు అందించారు. పూర్వ విద్యార్థి సంఘప్రతినిధిగా జయంతి చక్రవర్తి గారు పాల్గొని విద్యార్థులకు, లైబ్రరీకి పుస్తకాలను అందజేశారు. జిల్లెళ్ళమూడి గ్రామసర్పంచ్ గండికోట లక్ష్మి గారు, కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. చివరిగా మిఠాయి పంపిణీతో కార్యక్రమం ముగిసింది.

రిపబ్లిక్ డే వేడుకలు (26-1-2019)

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26వ తేదీన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఘనంగా జరిగాయి. విశ్రాంత భారత ఎన్నికల కమీషనర్ శ్రీ జి.వి.జి.కృష్ణమూర్తిగారు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతకాన్ని ఎగురవేసి గౌరవవందనాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశమనీ, మన దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా విద్యార్థులుండాలనీ హితవు పలికారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయిన జిల్లెళ్ళమూడిలో తాను ఈ రోజు పతాకావిష్కరణ చేయడం ఆనందంగా ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ పెద్దలు ఛీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు, మేనేజింగ్ ట్రస్టీ యమ్. దినకర్గారు, శ్రీరామమూర్తిగారు, బి.రామచంద్రగారు, చక్కా శ్రీమన్నారాయణగారు తదితరులు పాల్గొని జాతీయ పతాకానికి గౌరవవందనం చేసి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి పెంపొందించే పాటలతో, మాటలతో అందరినీ అ లరించారు. విద్యార్థుల దేశభక్తి పూర్వక క్రీడావిన్యాసం అందరినీ అ లరించింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ప్రేమకుమార్ గారు తమ సందేశాన్ని అందించారు. తెలుగు అధ్యాపకులు పి.మధుసూదన్ గారు రాజ్యాంగాన్ని గూర్చి సవివరంగా తెలియజేశారు. అనంతరం మిఠాయి పంపిణీ జరిగింది.

గురుపూజా మహోత్సవం

సమాజాన్ని సంస్కారవంతముగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని ఓంకారానందగిరిస్వామి తెలిపారు. 5-9-2018 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురుపూజా మహోత్సవంలో ఆయన ముఖ్యవక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.సుధామవంశీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అహంకారం, ఆత్మవంచన లేక శిష్యులందరినీ సమదృష్టితో చూసేవాడే నిజమైన గురువనీ, తాను ఆచరిస్తూ ఆచరింపజేసేవాడే ఆదర్శగురువనీ తెలియజెప్పారు. తెలుగు ఉపన్యాసకులు డాక్టర్ కె.వి. కోటయ్యగారు మాట్లాడుతూ గురుప్రాశస్త్యాన్ని సవివరంగా తెలియజేశారు. కళాశాల పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు గురువులకు నమస్కరిస్తూ ప్రసంగాలు చేశారు. ఈ కార్యక్రమములో సంస్థపెద్దలు సిబ్బంది పాల్గొన్నారు.

గురుపూజా మహోత్సవము

సుప్రసిద్ధ ఉపన్యాసకుడు, ‘ప్రవచన సమ్రాట్’, ‘రామాయణరసభారతి’, ‘ప్రసన్నవ్యాస’గా లోకంలో ప్రసిద్ధులైన ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారిని 27.7.2018 వ్యాసపూర్ణిమ సందర్భంగా కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పూజించటం జరిగింది.
ఆ సందర్భంగా జరిగిన సభలో శ్రీ విశ్వజననీ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ యం. దినకర్, కాలేజి కరస్పాండెంట్ శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. యల్. సుగుణ శ్రీమన్నారాయణమూర్తి విశిష్టతను గూర్చి ప్రసంగించారు. డాక్టర్ శిష్ట్లా ప్రసాద్ సభాహ్వానం పలుకగా శ్రీ సత్యనారాయణమూర్తి వందన సమర్పణ చేశారు.
శ్రీశ్రీమన్నారాయణమూర్తిగారు వ్యాసుని విశిష్టతను, గురువు యొక్క అవసరాన్ని, వ్యాసుడు పలికిన సూత్రాలలోని గొప్పతనాన్ని అమ్మ ఏలా అనుభవంలో అందరికీ అందించిందీ చెప్పిన మహాద్భుత సమన్వయసారం అందరినీ ముగ్ధులను చేసింది. అమ్మ ఏకాదశినాడు అవతరించిందని, వ్యాసుడు ఆదిముని లోకరక్షణ చేయటానికి పూర్ణిమనాడు ఉద్భవించాడనీ, ఇద్దరూ లోకానికి అందించిన సూత్రాలూ, సంస్కారాలు జగజ్జాగృతికి ఉపయోగపడుతున్నాయని వ్యాసహృదయాన్ని, అమ్మ అనుభవ వేదాంత నిధులను రంగరించి అందించారు సంస్థ సముచితరీతిని సత్కరించింది.
తదనంతరం వాత్సల్యాలయ ప్రాంగణంలో సామూహికంగా డాక్టర్ బి.యల్.సుగుణగారి నేతృత్వంలో ‘మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు’ పారాయణ చేశారు. సాయంకాలం సోదరి ఎమ్.వి. సుబ్బలక్ష్మి గారి కృషితో జ్యోతిస్వరూపిణి, జ్ఞానరూపిణి అమ్మ శ్రీ చరణాల చెంత అసంఖ్యాకంగా దీపాలను వెలిగించి భక్తితో అమ్మ నామ సంకీర్తన చేసి మంగళహారతి నిచ్చారు.