by admin | Jun 21, 2021 | Yoga
జూన్ 21వ తేదీ బుధవారంనాడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ సభ జరిగింది. ఉదయం 10 గంటలకు కళాశాల ప్రిన్సిపల్(IC) డాక్టర్ అన్నదానం హనుమత్ ప్రసాద్ గారు తమ అధ్యక్షోపన్యాసంలో కర్మభూమి అయిన మన భారతదేశంలో మానవుడు చిరంజీవిగా ఉండేందుకు ఋషులు మనకు అందించిన శాస్త్రాలలో యోగ శాస్త్రం ఒకటని తెలిపారు. మానవునిలోని షడ్చక్రాలను చైతన్య పరచడమే దీని లక్ష్యమని అష్టాంగ యోగంలో ప్రధానమైన ఆసన, ప్రాణాయామాల ద్వారా మనో నిగ్రహాన్ని కలిగించుకోగలమని వివరించారు. అనంతరం ఆత్మీయ అతిథి ఓంకారానంద గిరిస్వామి గారు రచించిన *సుగతి యోగం* అనే పుస్తకాన్ని ప్రిన్సిపాల్ గారు ఆవిష్కరించారు.
గారు సుగతి యోగంలోని విషయాలను తెలియపరుస్తూ రచయిత జిల్లెళ్ళమూడి అమ్మ చరిత్రను సంగ్రహించి వ్రాయ తలపెట్టిన తనకు అమ్మ జీవితమే ఒక దివ్య యోగంలా అనిపించి ఆమెను యోగమూర్తిగా దర్శించి దివ్యమైన అనంతమైన జీవిత పరమావధిని తెలుపుతూ ఈ పుస్తకాన్ని రచించినట్లుగా చెప్పారు. *ద్వంద్వజాలస్య సంయోగో యోగ ఉచ్యతే* అని చెప్పిన యోగశిఖోపనిషత్తుకు దగ్గరగా అమ్మ ‘ద్వంద్వాల మీదనే ఈ సృష్టి ఆధారపడి ఉంద’ని తెలిపిందన్నారు.
జాండ్రపేట నుంచి ప్రముఖ యోగాచార్యులు శ్రీ పద్మనాభుని తులసీరావు మాధవి దంపతులు విశిష్ట అతిథులుగా విచ్చేశారు. సంస్కృత ఉపన్యాసకులు డాక్టర్ ఆర్. వరప్రసాద్ గారు విశిష్ట అతిథిని సభకు పరిచయం చేశారు. తులసీ రావు గారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మీ అందరిలో ఉండే ఉత్సాహమే ఉత్సవంగా మారుతుంది కనుక అందరూ చిన్నచిన్న యోగాసనాల ద్వారా ఆరోగ్యవంతులుగా ఉత్సాహవంతులుగా ఉండవచ్చునని తెలిపారు. యోగ అంటే కలయిక ఇది అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ నెగటివ్ ఎనర్జీ రెండింటిని సమతుల్యం చేసుకోగలిగితే మనలో ఉన్న అనంతమైన శక్తి బయటకు వస్తుందని వివరించారు. పార్టిసిపేటివ్ మెథడ్ అనుసరిస్తూ విద్యార్థులతో మాట్లాడిస్తూ చిన్న చిన్న ఆసనాలు ప్రాణాయామం ద్వారా వచ్చే శక్తిని ప్రత్యక్షంగా అనుభవించేలా చేశారు. మన ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలమని తద్వారా సమాజం కూడా ఆరోగ్యంగా ఉండగలదని తెలిపారు. కార్యక్రమంలో సత్యమూర్తి గారికి తులసిరావు, మాధవి దంపతులకు అమ్మ ప్రసాదాన్ని అందించి సత్కరించారు. కార్యక్రమం ఆసాంతం తెలుగు ఉపన్యాసకులు శ్రీ బి.వి. శక్తిధర్ గారు సభా నిర్వహణ చేయగా డాక్టర్ యల్. మృదుల గారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వందన సమర్పణ గావించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.
by admin | Mar 22, 2021 | Orientation Programm
గత అయిదు దశాబ్దాలుగా ప్రతిష్ఠాత్మకంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల దిగ్విజయంగా నడపబడుతుంది. ఎన్నో మైలురాళ్ళుదాటుకొని రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును కూడా పొందింది. ప్రభుత్వ నిబంధనల మేరకు మన కళాశాలకు 22.03.2021 సోమవారం రోజున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుండి FFC (Fact Finding Committee) వారు విచ్చేశారు. Dr.N.V. కృష్ణారావు H.O.D (Department of Oriental Language) Dr.E.V. పద్మజ Department of History and Archeology Visit చేశారు. మన కళాశాలకు స్వయంగా విచ్చేసిన ప్రొఫెసర్స్ ఇద్దరూ కూడా కళాశాలకు కావలసిన మౌలిక సదుపాయాలను పరిశీలించి మూల్యాంకన చేశారు. Documents ను కూడా పరిశీలించి కళాశాల గుర్తింపును కొనసాగిస్తామని తెలిపారు. విశ్వజననీ పరిషత్ వారు అధికారులకు అమ్మ శేషవస్త్రాలను సమర్పించి సత్కరించారు. 4 రోజులపాటు విద్యార్థులు అధ్యాపకు లందరి పర్యవేక్షణలో కళాశాల ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కళాశాల కరస్పాండెంట్ డా॥బి.యల్. నుగుణ గారు మరియు కళాశాల ప్రిన్సిపాల్ డా॥ఎ. సుధామవంశీ గారు విద్యార్థులను అభినందించారు.
by admin | Feb 21, 2021 | Local Functions
21.2.2021 : మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు కళాశాల అనసూయేశ్వర వసతి గృహంలో ఆదివారం నాడు అమ్మ ఆగమనోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమంలో శ్రీ విశ్వజననీ పరిషత్ చీఫ్ ప్యాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు ప్రెసిడెంట్ యమ్. దినకర్గారు, జనరల్ సెక్రటరీ డి.వి.యన్. కామరాజు గారు మరియు కమిటీ సభ్యులు పి. గిరిధర్ కుమార్ గారు, చక్కా శ్రీమన్నారాయణగారు, టి. మురళీధర్ గారు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీ గారు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. రంగవల్లులతో పచ్చని తోరణాలతో కన్నులపండుగగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులు లలితాసహస్రనామ పారాయణ చేసి ప్రసాదవితరణతో కార్యక్రమాన్ని ముగించారు
by admin | Feb 20, 2021 | Local Functions
20-2-2021 మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థినుల వసతిగృహంలో ఫిబ్రవరి 20 వ తేదీ శనివారం అమ్మ ఆగమనోత్సవం వైభవంగా జరిగింది. పచ్చని తోరణాలతో, రంగవల్లులతో, పుష్పాలతో ఎంతో అందంగా వసతిగృహాన్ని అలంకరించారు. విద్యార్థినులు అమ్మను భక్తిశ్రద్ధలతో అర్చించారు. లలితా సహస్రనామ పారాయణ చేశారు. కార్యక్రమంలో సంస్థపెద్దలు విశ్వజననీ ట్రస్టు అధ్యక్షులు ఛైర్మన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు గారు, వసుంధరక్కయ్య, కళాశాల అధ్యాపక బృందం, ఆవరణలో పలువురు పెద్దలు విచ్చేసి అమ్మకు నమస్కరించి విద్యార్థినులను ఆశీర్వదించారు.
by admin | Dec 2, 2020 | Personality Development
సంస్కారవంతమైన ఆలోచనలు చేస్తూ దీర్ఘమైన నినాదాలని జి.యల్.మునోహర్ గారు తెలిపారు. ది. 12.2.2020 బుధవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో వ్యక్తిత్వ వికాసంపై అవగాహన సదస్సు జరిగింది. ఇక్కడ చదివే విద్యార్థులు అమ్మ సంపూర్ణ అనుగ్రహాన్ని పొందియున్నారని మనోహర్ గారు తెలిపారు. విద్యార్థులతో మమేకమై, పలువిధాలుగా ప్రశ్నించి నిజమైన వ్యక్తిత్వం అంటే ఏమిటో వారి నుంచి రాబట్టారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.వి. హనుమంతయ్య గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. వ్యక్తిత్వమనేది మానవునికి కనిపించని భూషణమనీ, మనలోని ఆలోచనలకి, భావాలకి, ప్రవర్తనకి సంబంధించినదే వ్యక్తిత్వమనీ వివరించారు. ఈ కార్యక్రమం చివరిలో మనోహర్ గారిని ప్రిన్సిపాల్ తో పాటు సంస్థ పెద్దలు శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో అధ్యాపకులు, విద్యార్థులు, సంస్థపెద్దలు పాల్గొన్నారు.