by admin | Dec 10, 2021 | Orientation Programm
1971 లో అమ్మ నెలకొల్పిన ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవాలు 10, 11, 12 డిసెంబర్ 2021 తేదీలలో వైభవంగా జరిగాయి. 10-12-2021 ఉదయం శ్రీమతి వసుంధర జ్యోతి ప్రజ్వలన చేశారు. డా. యం. శ్యామల స్వర్ణోత్సవ గీతం గానం చేసింది. ఆంధ్రరాష్ట్ర శాసనసభ ఉపసభాపతి శ్రీ కోన రఘుపతిగారు ఉత్సవాలను ప్రారంభించి స్వర్ణోత్సవ విశిష్ట సంచిక ఆవిష్కరించారు. సభాధ్యక్షులుగా శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్యక్షులు శ్రీ దినకర్ వచ్చారు. శ్రీ విశ్వజననీ పరిషత్ పాట్రన్ శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావుగారు “విశ్వజనని” మాసపత్రిక స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ప్రసిద్ధ ఉపన్యాసకులు ఆచార్య శ్రీమల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి స్వర్ణోత్సవ సంయోజన చేశారు.
ఉపసభాపతి శ్రీ రఘుపతి బాల్యం నుండి అమ్మతో తమకు ఉన్న అనుబంధాన్ని వివరించి సంస్కృతాంధ్ర భాషల అభివృద్ధి జాతికి మేలు చేస్తుందని చెప్పారు. సంస్కృతికళాశాల అభివృద్ధికి కృషిచేసిన శ్రీ బొప్పూడి రామబ్రహ్మగారికి “జీవిత సాఫల్యా సేవా పురస్కారం” అందించి సత్కరించారు. ప్రముఖ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్. మూర్తి నవభారత బాంక్ చైర్మన్ శ్రీ పాండురంగారావు శ్రీరామబ్రహ్మంగారిని గూర్చి ప్రసంగించారు. శ్రీదేశిరాజు కామరాజు గారు సభకు ఆహ్వానం పలికారు. శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ సభా నిర్వహణ చేశారు.
మధ్యాహ్నం జరిగిన సభలో శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు అధ్యక్షత వహించారు. విశిష్ట అతిధిగా అడిషనల్ కమీషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ శ్రీ భూపతిరాజు సత్యనారాయణ రాజు సంస్కృతం ఈ జాతి జీవనాడి అంటూ చిన్నప్పటి తన అనుభవాలు అమ్మను చూడాలని జిల్లెళ్ళమూడిని దర్శించాలనే తన కోరిక ఈ రకంగా నెరవేరటం ఆనందంగా ఉన్నదని చెప్పారు.
విశ్వజననీపరిషత్ స్థానిక కార్యదర్శి శ్రీ లక్కరాజు సత్యనారాయణ అమ్మతో తన అనుబంధాన్ని వివరించారు. పూర్వవిద్యార్థి సమితి విశ్వజననీ పరిషత్ కార్యవర్గసభ్యులను సత్కరించారు. పూర్వవిద్యార్థి శ్రీ యస్.యల్.వి.ఉమామహేశ్వరరావు వందన సమర్పణ చేశారు. సాయంత్రం సామూహిక లలితాసహస్ర నామ పారాయణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడినవి.
by admin | Aug 21, 2021 | Yoga
“వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖమ్ ।
ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనమ్ ||
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి ‘యోగా’ అనేది ఒక అత్యుత్తమమైన సాధనం. ప్రపంచ దేశాలన్నీ ఏకమై జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో సభను ఏర్పాటుచేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. రావినూతల వరప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్యఅతిథిగా Spiritual Master, HRM Trainer శ్రీమతి S.P.అన్నపూర్ణ గారు మరియు సిద్ధార్థ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సిద్ధార్థ గారు పాల్గొన్నారు. సభలో శ్రీమతి అన్నపూర్ణ గారు విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ సాధకులకు, జిజ్ఞాసులకు ఆలవాలమైన మన భారతదేశంలో నాల్గవ శతాబ్దంలో పతంజలి మహర్షి యోగసూత్రాలను మనకు అందించారని యోగ సాధనతో సాధించలేనిది లేదని తెలియజేశారు. సత్యం, ధర్మం, శీలం అనే మూడు సూత్రాల కలయికతో జ్ఞానంతో కూడిన విజ్ఞానాన్ని పొందాలని వివరించారు. శ్రీ సిద్దార్థ్ గారు తాను తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల గ్రామం నుంచి అందరినీ విద్యావంతులను చేయాలనే ఒక లక్ష్యంతో బయలుదేరి ముందుకు వెళుతున్న తనకు ఈరోజున మన ఆశ్రమానికి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అమ్మ అందించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకొని జ్ఞాన ప్రమిదలుగా అందరూ వెలుగొందాలని చెప్పారు. అనంతరం కళాశాల చరిత్ర అధ్యాపకులు P. సుందరరావుగారు మానసిక ఉల్లాసంతోనే ఆరోగ్యం ఉంటుందని, అది యోగా ద్వారానే సాధ్యమని పలు ఉదాహరణలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు యోగ ఆవశ్యకత, షట్చక్రాలు, సూర్య నమస్కారాలు వంటి పలు అంశాలలో వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈపోటీలకు డా.A. హనమత్ప్రసాద్ గారు, శ్రీమతి.L.మృదుల గారు, శ్రీమతి.M.కవిత గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. తెలుగు అధ్యాపకులు I.V.S. శాస్త్రి గారు సభానిర్వహణ గావించారు. శాంతి మంత్రంతో కార్యక్రమం ముగిసింది.
by admin | Aug 15, 2021 | National Commemorative Days
15.08.2021 మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడిలో 15.8.21 ఆదివారంనాడు 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. వైభవంగా కళాశాల మరియు పాఠశాలల కరస్పాండెంట్ శ్రీమతి బి.యల్.సుగుణ గారు పతాకావిష్కరణ చేశారు. ప్రిన్సిపాల్ డా. ఎ. సుధామవంశీ గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వజననీ పరిషత్ ప్రెసిడెంట్ గారు శ్రీ యమ్. దినకర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు, శ్రీ. పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు, శ్రీ పి. గిరిధర్ కుమార్ గారు, శ్రీ రావూరి ప్రసాద్ గారు, శ్రీ బూదరాజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు పాల్గొన్నారు. పలువురు దాతలు విద్యార్థులను ప్రోత్సహిస్తూ అందించిన బహుమతులను సంస్థ పెద్దలు అందించారు. పూర్వ విద్యార్థి సంఘప్రతినిధిగా జయంతి చక్రవర్తి గారు పాల్గొని విద్యార్థులకు, లైబ్రరీకి పుస్తకాలను అందజేశారు. జిల్లెళ్ళమూడి గ్రామసర్పంచ్ గండికోట లక్ష్మి గారు, కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించారు. చివరిగా మిఠాయి పంపిణీతో కార్యక్రమం ముగిసింది.
by admin | Aug 9, 2021 | Orientation Programm
జిల్లెళ్ళమూడిలో ‘అమ్మ’ నెలకొల్పిన మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విజయవంతంగా అర్థ శతాబ్ది కాలంగా విద్యాసేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా కళాశాల పూర్వవిద్యార్థులు వాడవాడలా స్వర్ణోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆగష్టు 6, 7, 8, 9 తేదీల్లో ఈ మహోత్సవాలు అమ్మ ఆశయానికి అనుగుణంగా, నిరాడంబరంగా సార్థకంగా జరిగాయి. “జిల్లెళ్ళమూడి అమ్మ సేవాసమితి” పేరుతో తమతమ ప్రాంతాల్లో శాఖలు ఏర్పాటు చేసుకున్న పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవాలను సుసంపన్నం చేశారు. సభలు నిర్వహించి అమ్మ ప్రేమతత్వాన్ని, సేవా దృక్పథాన్ని పదిమందికీ చాటి చెప్పారు. తమ తమ ప్రాంతాలలో వివిధ రంగాలలో ప్రముఖులైన పెద్దలను అతిథులుగా ఆహ్వానించి, అమ్మ తత్త్వ ప్రచారాన్ని దీక్షతో నిర్వహించారు. తమకు విద్యాభిక్షపెట్టిన గురువుల సందేశాలను సభలలో వినిపించారు. జిల్లెళ్ళమూడిలో వివిధ రంగాలలో సేవలు అందించిన ప్రముఖులను స్మరించి వారిచ్చిన స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామని ప్రకటించారు. అమ్మ ప్రబోధించిన ప్రేమ, సేవ, పరోపకార పారీణత నిరాడంబరత మొదలైన ఉదాత్త గుణాలను పునశ్చరణ చేసుకున్నారు. ఈ ఉత్సవ నిర్వహణలోని ఆంతర్యాన్ని వెల్లడించారు. మాతృశ్రీ విద్యాపరిషత్, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలల వ్యవస్థాపకులు, నిర్వాహకులు అయిన పెద్దలను స్మరించి, వారికి ఘనంగా నివాళులర్పించారు.
కీ.శే. అధరాపురపు శేషగిరిరావు, కీ. శే. బొడ్డుపల్లి సీతారామస్వామిశాస్త్రి, కీ.శే. కొండముది రామకృష్ణ, కీ.శే.పన్నాల రాధాకృష్ణశర్మ ప్రభృతుల త్యాగనిరతినీ, అకుంఠిత దీక్షనూ ఆదర్శంగా తీసుకుని ఈ మహోత్సవాలను నిర్వహిస్తున్నామని ప్రకటించారు. అమ్మను, అమ్మ సంస్థనూ ఆదరించి తీర్చిదిద్దిన పెద్దలను మరువలేమని, అవకాశం ఉన్నంతలో అన్న సంతర్పణలు, ఉపకార వేతనాలు అందించి, అమ్మ ఆశయాన్ని ఆచరణ రూపంలో లోకానికి వెల్లడించటమే ఈ ఉత్సవాన్ని తమ ప్రాంతంలో నిర్వహించటంలోని ఆంతర్యమని స్పష్టం చేశారు. విద్యతో పాటు క్రమశిక్షణను సముదాత్త జీవన వైఖరినీ నేర్పిన గురువులందరికీ ధన్యవాదాలు చెప్పారు. సేవానిరతిని బోధించి, తమకు మార్గదర్శనం చేస్తున్న విశ్రాంత ప్రధానాచార్యులు శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారికి కృతజ్ఞతలు తెలిపారు.కాకినాడ: పూర్వవిద్యార్థి పి.అప్పారెడ్డి నేతృత్వంలో – మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవ సభ, అన్నప్రసాద వితరణ వైభవంగా జరిగాయి. ఎందరో పేదవిద్యార్థులకు వెయ్యి రూపాయలు చొప్పున ఉపకార వేతనాలు ఇచ్చారు.తెనాలి, రేపల్లె : పట్టణ ప్రముఖలతో సభలు నిర్వహించి, పూర్వవిద్యార్థులు అన్నప్రసాదం పంచి పెట్టారు.
పార్వతీపురం : 6వ తేది ఉ.10గంటలకు రాజా హిందీ శిక్షణ కళాశాలలో స్వర్ణోత్సవ సంరంభానికి శుభారంభం జరిగింది. శ్రీ గంటేడ నాయుడు అధ్యక్షతన జరిగిన సభలో విద్యావేత్త శ్రీ మంచిపల్లి శ్రీరాములు ప్రారంభోపన్యాసం చేశారు. పార్వతీపురం డి.యస్.పి. శ్రీ ఎ.సుభాష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. శ్రీ గంటేడ చిన్నంనాయుడు నేతృత్వంలో ఎందరో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దలు, పురప్రముఖులు అమ్మ ప్రేమతత్త్వాన్ని కీర్తిస్తూ అంజలి ఘటించారు. అనంతరం ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఫుడ్బ్యాంకు పేరుతో పూర్వవిద్యార్థులు ఏర్పాటు చేసిన “అమ్మ అన్న ప్రసాద వితరణ” కార్యక్రమాన్ని ఆసుపత్రి సూపరింటెండెంటు శ్రీమతి వాగ్దేవి ప్రారంభించారు. పేదలకు, వ్యాధిగ్రస్తులకు, వికలాంగులకు అన్నప్రసాదం పంచారు. ముఖ్యవిశేషం ఏమిటంటే, 6వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం నేటికీ నిరాటంకంగా సాగుతోంది.పాలకొండ : జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో – మాతృశ్రీ పూర్వవిద్యార్థులు అమ్మ కళాశాల స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు.స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జామి రవి ముఖ్యఅతిథిగా పాల్గొని, సందేశం అందించారు. పూర్వవిద్యార్థులు మజ్జి సత్యం అధ్యక్షతలో జరిగిన ఈ సభను బౌరోతు శంకరరావు వ్యాఖ్యాతగా నిర్వహించారు. వ్యవహరించాడు. ఈ సందర్భంగా అమ్మ ఫోటోలను, బౌరోతు శంకర్రావు వ్రాసిన “జిల్లెళ్ళమూడి అమ్మ జీవిత చరిత్ర” గ్రంథాలను అందరికీ పంచిపెట్టారు. ఎందరో పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.500/- చొప్పున ఉపకారవేతనం అందించారు. అనంతరం అందరికీ “మహాప్రసాదం” (భోజనం) ఏర్పాటు చేశారు.రాజాం : రాజాం పట్టణంలో పూర్వవిద్యార్థి పి.చైతన్యకుమార్ ఆధ్వర్యంలో ఫుడ్బ్యాంక్ ప్రారంభించి, అమ్మ ప్రసాదమైన అన్నం ఎందరికో పంచిపెట్టే కార్యక్రమం నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, కరోనా రోగులకు సేవలు నిర్వహించారు.రాజమహేంద్రవరం : అమ్మ కళాశాల స్వర్ణోత్సవం రాజమహేంద్రవరం శ్రీ గాయత్రీ దత్తాత్రేయ వేదపాఠశాలలో జరిగింది. మాతృశ్రీ పూర్వవిద్యార్థి మరువాడ కామేశ్వరశర్మ నేతృత్వంలో వేద విద్యార్థులకు భోజన వసతి కోసం రూ.7,000/ నగదు, బియ్యం, కందిపప్పు, పంచదార మొదలైన నిత్యావసర సరుకులు సమర్పించారు.విజయనగరం : మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల స్వర్ణోత్సవసభలో విజయనగరం జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీమతి కె. సుధామణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా అటవీశాఖాధికారి శ్రీ రాజారావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. అతిథులందరూ అమ్మ మహనీయతను, విద్యార్థుల కార్యదీక్షను ప్రశంసించారు. గతంలో తాము జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మను దర్శించుకొని, ఆశీస్సులు పొందామని ప్రకటించారు. సభానంతరం ఎందరో వికలాంగ యాచకులకు అమ్మప్రసాదంగా భోజనం పెట్టి, దుప్పట్లు పంచి పెట్టారు. పూర్వవిద్యార్థి త్రినాధ్ పర్యవేక్షణలో అక్కడి కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి.విశాఖపట్నం : చంద్రంపాలెం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా మాతృశ్రీ పూర్వవిద్యార్థులు అమ్మ కళాశాల “స్వర్ణోత్సవం” విశాఖలో ఘనంగా విశాఖ డి.యస్.పి.శ్రీ బి. విజయకుమార్, అరబిందో ఫార్మాలిమిటెడ్ డి.జి.ఎం. శ్రీ ఎన్. వెంకట రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం. రాజబాబు, శ్రీమతి ఎ.జయప్రద, పేరెంట్స్కమిటీ ప్రతినిధులు శ్రీశ్రీనివాస్, శ్రీ సూరిబాబు ప్రభృతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పూర్వవిద్యార్థి పొట్నూరు కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో అందరూ అమ్మ ఆశయాల ఔన్నత్యాన్ని, కళాశాల క్రమశిక్షణ వాతావరణాన్ని కొనియాడారు. అన్నం పెట్టటం, వస్త్రాలు ఇవ్వటం, వైద్యసహాయం మొదలైన సేవలన్నీ మాతృయాగంలో భాగమని అన్నారు. ఎందరో పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యిరూపాయలు చొప్పున ఉపకార వేతనం, ప్రశంసాపత్రం, అమ్మ కేలండర్, శివ లెంక ప్రసాదరావు రచించిన గ్రంథాలు అందించారు.శ్రీకాకుళంలో సాలూరులో “అమ్మ బడి” పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాల జరుగుతున్నాయి. సాలూరులో రక్తదాన శిబిరాలు నిరంతరం నిర్వహిస్తున్న శివలెంక ప్రసాదరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. పేదవిద్యార్థులకు – వెయ్యేసి రూపాయల చొప్పున విస్తృత స్థాయిలో ఉపకారవేతనాలు పంపిణీ జరిగింది.
వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ కార్యక్రమాలలో గంటేడ సోమేశ్వరరావు, తామాడ సూర్యనారాయణ, ఎం.జగన్నాధం, కొక్కిలిగడ్డ సూర్యనారాయణ, అరటికట్ల కామేశ్వరరావు, ఎ. హరిబాబు, హరనాధ్, భవిరిపూడి శ్రీరామమూర్తి, తులసీరావు, ఎ.వి.వి. రాజారావు, తెంటు కృష్ణమూర్తి, దత్తి కృష్ణ, పూడి కృష్ణ, దత్తి సూర్యనారాయణ, గౌరీప్రసాద్, దాసరి శ్రీరామమూర్తి, ఎ.యస్.వరప్రసాద్, జె. శేషాద్రి, రాఘవేంద్రరావు మొదలైన ఎందరో పూర్వ విద్యార్థులు సమధికోత్సాహంతో పాల్గొన్నారు.కుంభమేళా సందర్భంగా ఉత్తరభారతంలో విస్తృతంగా “అమ్మ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలుజరిగాయి. పూర్వ విద్యార్థుల ప్రతినిధిగా డాక్టర్ జయంతి చక్రవర్తి ఈ బాధ్యతను స్వీకరించి, నిర్వహించాడు. కళాశాల స్వర్ణోత్సవ సంరంభం అమ్మ అన్నప్రసాద వితరణం ఆనాడే ప్రారంభం అయ్యాయి.ఈ పూర్వ విద్యార్థులందరూ అమ్మ కరుణకు పాత్రులైన అదృష్టవంతులు. భావితరాలకు ఆదర్శ మూర్తులు. ఈ స్వర్ణోత్సవాలను నిర్వహించి, సేవ, ప్రేమ, త్యాగము, కరుణ మొదలైన అమ్మ ఆశయాలను ఆచరణాత్మకంగా అనుసరించిన అమ్మ తత్త్వ ప్రచార సాధకులు ఈ పూర్వవిద్యార్థులు. బాధ్యతా యుత మూర్తులైన ఈ ఆదర్శవిద్యార్థులను శ్రీ విశ్వజననీ పరిషత్, మాతృశ్రీ విద్యాపరిషత్ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాయి. అమ్మ ఆశీస్సులలో వీరందరూ సకలాభీష్టాలు పొందాలని, ఇలాగే మరెన్నో సేవాకార్యక్రమాల ద్వారా అమ్మ తత్త్వాన్ని ప్రచారం చేయాలని ఆకాంక్షిస్తూ…
అభినందనలతో ఆశీస్సులతో శుభాకాంక్షలతో… సంపాదకవర్గం, “విశ్వజనని”
by admin | Aug 3, 2021 | International Commemorative Days
మార్చి 8 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో మహిళలకు ప్రాధాన్యతనిచ్చిన దేశం భారతదేశం అని కళాశాల ప్రిన్సిపాల్ డా|| ఎ. సుధామ వంశీ అన్నారు. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’ అన్న ఆర్యోక్తిని వివరించి అమ్మ మహిళలు విద్యావంతులైతే సమాజ పురోగతిని సాధిస్తుందనే సదుద్దేశంతో కళాశాల స్థాపించిందని విద్యార్థులకు తెలియచెప్పారు. ఈ సభలో కళాశాలలో పనిచేస్తున్న మహిళా అధ్యాపకులను గౌరవించి వారి అభివృద్ధికి కారణాలు, తమకు ఎదురవుతున్న సమస్యలు విద్యార్థులతో వంచుకోవాలని ప్రిన్సిపాల్గారు కోరారు. డా॥యల్.మృదుల మాట్లాడుతూ తాను తన చిన్నతనంలో పడిన కష్టాలను, తన విద్యాభ్యాసం, ఉద్యోగప్రస్థానం అన్నింటినీ చెప్పి అమ్మ దయవలనే కేవలం తను ఈ స్థితిలో ఉన్నానని అర్ద్రతతో కూడిన భక్తితో విద్యార్థులకు తన అనుభవాలు చెప్పారు. యమ్. కవిత మాట్లాడుతూ నేడు ప్రతి మహిళ అన్ని రంగాలలో ముందుంటుంది. మనం అనుకుంటే సాధించలేనిది ఉండదు అని తాను తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు చెప్పి విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపారు. డా|| వి. పావని మాట్లాడుతూ ప్రకృతి, పురుషుడు అనేది విభాగమే కానీ. విభేదం లేదు. అది కేవలం నడవడం కోసమేనని రహస్యాన్ని తెలుసుకోగలిగితే విభేదం లేదని సృష్టి చెప్పారు. బాధ్యతతో కూడిన అధికారాన్ని మాత్రమే ఆశిస్తూ ప్రతి మహిళా ముందుకు వెళ్ళాలని హితవు పలికారు. రమ్య (లైబ్రేరియన్) మాట్లాడుతూ తాను ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాతకూడా తనకున్న ఆసక్తితో పై చదువులు చదవగలిగానని, తాను చదువుకోవడానికి శరశ్చంద్ర అన్నయ్యగారు ఎంతో ప్రోత్సహించారనీ గుర్తుచేసు కొన్నారు. ఇలా మహిళా దినోత్సవంనాడు మహిళా అధ్యాపకులకు ప్రత్యేక సభా నిర్వహణతో డా॥ ఎ. సుధామ వంశీ గారి అధ్యక్షతన ఆర్.వరప్రసాద్ గారి సభా నిర్వహణతో డా॥హనుమత్ ప్రసాద్ గారి ఛలోక్తులతో సభముగిసింది. కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.