ఘనంగా గురు మహోత్సవం

సమాజాన్ని సంస్కారవంతంగా ధర్మపథంలో నడిపించగల ప్రతిభ ఒక్క గురువుకే ఉందని ఓంకారానంద గిరి స్వామి తెలిపారు.5/9/2018 బుధవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో జరిగిన గురు మహత్సవంలో ఆయన ముఖ్య వక్తగా ప్రసంగించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా॥ఎ. సుధామ వంశీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అహంకారం, ఆత్మవంచన లేక శిష్యులందరినీ సమదృష్టితో చూసేవాడే నిజమైన గురువని, తాను ఆచరిస్తూ, ఆచరింపజేసేవాడే ఆదర్శగురువనీ తెలియజెప్పారు. తెలుగు ఉపాధ్యాయులు డా.కె.వి. కోటయ్యగారు మాట్లాడుతూ గురు ప్రాశస్త్యాన్ని సవివరంగా తెలియజేశారు. కళాశాల, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు గురువులకు నమస్కరించి ఒక్కొక్కరుగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంస్థ పెద్దలు ఎస్. లక్ష్మణ రావు, ఎ, దినకర్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండముది ప్రేమ్ కుమార్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

సమాజంలో మానవీయ విలువలు (స్ఫూర్తి కార్యక్రమము)

ప్రభాకరస్వామివారు (హైదరాబాద్) కళాశాలలో ఆగష్టు 23, గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సేవాభావము, పరస్పర సహకారం, త్యాగభావనవల్లనే ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు. సంస్కారవంతమైన ఆలోచనలు పెంపొందించటం ప్రతిఒక్కరి కర్తవ్యంగా ప్రబోధించారు.

భగవద్గీత – జీవన నైపుణ్యాలు

అహంకార మమకారాలను తొలగించుకుంటే స్వధర్మాన్ని నెరవేర్చుకోవచ్చు . ” స్వధర్మే నిధనం శ్రేయః ” అని భగవద్గీతలో చెప్పిన వాక్యాన్ని శ్రీ బొప్పూడి రామబ్రహ్మం గారు వివరించారు. 22-7-2017 సోమవారం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో భగవద్గీత – లైఫ్ స్కిల్స్’ అనే అంశంపై జరిగిన ఉపన్యాసంలో ఆయన మాట్లాడుతూ భగవద్గీత లోని అనేక విషయాలు నిత్యజీవితంలో పాటించ గలిగితే జీవనం సుగమం అవుతుందని సోదాహరణంగా వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. సుధామ వంశీ గారి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో 1986 సం॥ నాటి పూర్వ విద్యార్థులు పాల్గొనటం విశేషం. భగవద్గీత మహోన్నతునిగా తీర్చి దిద్దగలదని స్వీయానుభూతులైన ఎన్నో అంశాలను ఉదహరిస్తూ రామబ్రహ్మం అన్నయ్య ప్రసంగించారు. విద్యార్థులంతా అమ్మ తత్వాన్ని అలవరచుకోవాలని తెలియ చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.